కలం, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేటీఆర్తోపాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, ఇంజినీరింగ్ అధికారిగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి సహా పలువురికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో కేటీఆర్ ఏ-1గా ఉన్న విషయం తెలిసిందే.
జూలై 31న కేటీఆర్ సహా ఇతర నిందితులు విచారణను ఎదుర్కోబోతున్నారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అనుమతులు, ఖర్చుల అంశాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా విచారణ కొనసాగుతుండగా, తాజాగా కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం.
ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు విచారణలు మాత్రమే చేస్తున్నారు. మరి తాజాగా ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ అనుమతులు లేకుండా నిధులు విడుదల చేసినట్టు విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది.

