కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాధికను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఐసీడీఎస్కు కోడిగుడ్లు, పప్పులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి యూపీఐ లావాదేవీల ద్వారా రూ.2,37,500 మేర అక్రమంగా వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సరఫరాదారుల బిల్లులను త్వరగా క్లియర్ చేయడం, పెండింగ్ ఫైళ్లను ముందుకు కదిలించడం కోసం రాధిక డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు రూపంలో కాకుండా యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవడంతో పాటు కొన్ని లావాదేవీలు బినామీ ఖాతాల ద్వారా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాత్ర ఉందా, గతంలో కూడా ఇలాంటి వసూళ్లు జరిగాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

