కలం, కరీంనగర్ బ్యూరో: ఎమ్మార్పీ (MRP) వినియోగదారులకు రక్షణలా కాకుండా, మోసం చేసే సాధనంగా మారిందని అఖిల భారతీయ గ్రహక్ పంచాయతీ (ఏబీజీపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగమల్ల సురేష్ ఆరోపించారు. ఒకే వస్తువు – ఒకే ధర, ఎమ్మార్పీ నియంత్రణ చట్టం తీసుకురావాలనే డిమాండ్లతో ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. మొదటగా వినియోగదారుల్లో అవగాహన కల్పించి, ప్రధాని మోదీకి లేఖలు పంపిస్తామన్నారు. అలాగే, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను ఇప్పటికే సమర్పించామన్నారు. కంపెనీలు తమ ఇష్టానుసారం అత్యధిక ఎమ్మార్పీ పెట్టి తర్వాత భారీ డిస్కౌంట్లు ప్రకటించి వినియోగదారులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే వస్తువు ధర ఆఫ్లైన్, ఆన్లైన్లో చాలా హెచ్చు తగ్గులు ఉంటున్నాయని వివరించారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏబీజీపీ కార్యకర్తలతో పాటు వినియోగదారుల క్లబ్ సభ్యులు కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు.

