కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) పట్టణంలో శనివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) వద్ద అపశృతి చోటుచేసుకుంది. విగ్రహానికి అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో విగ్రహం కొంత భాగం కాలిపోయినట్లు వారు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన నల్లగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
అనంతరం మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి విగ్రహాన్ని శుభ్రపరిచే పనులను చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎవరైనా కావాలనే విగ్రహానికి (NTR Statue) నిప్పంటించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారా? లేదా విగ్రహం వద్ద ఉన్న విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే విషయాలను తేల్చడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనకు గల అసలు కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Read Also: మోదీ పాలనలో అన్ని రంగాలు నాశనం: మల్లికార్జున ఖర్గే
Follow Us On: Instagram

