కలం, వెబ్డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) ముగిశాయి. రెండు సభలు 19రోజుల పాటు సమావేశమయ్యాయి. పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు మార్పు, అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే బిల్లు ముఖ్యమైనవి. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే ఈ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులు, జరిపిన చర్చలు తదితర వాటి గురించి స్పీకర్ ఓం బిర్లా క్లుప్తంగా చదివి వినిపించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు సైతం కొందరు ప్రతిపక్ష సభ్యులు సభలో ‘మహాత్మా గాంధీ కి జై’ నినాదాలు చేశారు. కాగా, ఈ సమావేశాల్లోనే 150 ఏళ్ల వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. అలాగే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించీ వాడీవేడీ చర్చ జరిగింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం అంగీకరించలేదు. కేవలం ఎన్నికల సంస్కరణలపై మాత్రం చర్చ జరిగింది. ‘సర్’, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, ‘వోట్ చోరీ’పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టాయి. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లు, న్యూక్లియర్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ‘శాంతి’ బిల్లు ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్ అయ్యాయి. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్లో 100శాతం ఎఫ్డీఐలకు ఆమోదిస్తూ సవరణ బిల్లు ‘సబ్కా బీమా సబ్కీ రక్ష’ పాస్ అయ్యింది. ఉన్నత విద్యలో అన్ని విభాగాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్’ బిల్లు జాయింట్ కమిటీ ఆమోదానికి పంపారు. మొత్తానికి ఈ సమావేశాల్లో (Parliament winter session ) సర్.. మహాత్మాగాంధీ.. జి రామ్ జి.. శాంతి పదాలు మారుమోగాయి.


