కలం, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంచడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఇంధన ధరల పెంపు ఏమాత్రం సమర్థనీయం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో అనేక రంగాలపై ప్రభావం చూపడంతో నిత్యావసరాల రేట్లు పెరిగి సామాన్యులకు భారంగా మారుతుందన్నారు. ప్రధాని మోదీ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని ఆయన విమర్శించారు. ‘ఆత్మ నిర్భర్’ కేవలం ఓట్లు రాల్చే నినాదం మాత్రమేనని.. ఫలితాలు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మోదీ (PM Modi) అసమర్థ పాలనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ వట్టి మాటగా మిగిలిందని ఆరోపించారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ.. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు. ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని సీఎం విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం అని చెప్పిన మోదీ.. ఫలితాలు వచ్చిన 10 రోజులకే రేట్లు పెంచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని దుయ్యబట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) డిమాండ్ చేశారు.
Read Also: ఉదయం 6 గంటల నుంచి 10 వరకే పెట్రోల్ బంకులు!
Follow Us On: WhatsApp

