epaper
Friday, January 16, 2026
spot_img
epaper

బాండీ బీచ్​ నిందితుడు హైదరాబాదీ!

కలం, వెబ్​డెస్క్​: ఆస్ట్రేలియా బాండీ బీచ్​ కాల్పుల ఉదంతం (Bondi Beach) లో హైదరాబాద్​ లింకులు బయటపడ్డాయి. నిందితుల్లో ఒకరైన సాజిద్​ అక్రం(50) హైదరాబాద్​ వాసిగా తేలింది. ఈ మేరకు నిందితుడి వద్ద ఇండియన్​ పాస్​పోర్ట్​ను గుర్తించిన ఆస్ట్రేలియా అధికారులు భారత్​కు సమాచారమిచ్చారు. దీంతో భారత భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై తెలంగాణ డీజీపీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితుడు హైదరాబాదీ అని తెలిపింది. మరింత దర్యాప్తు కోసం నిందితుడి కుటుంబసభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. హైదరాబాద్​లోని పాతబస్తీకి చెందిన సాజిద్​ విద్యార్థి వీసాపై 27 ఏళ్ల కింద ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్న అనంతరం భారత్​లోని కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నాడు. అతని కుమారుడు నవీద్​​ అక్బర్​, ఒక కుమార్తె ఉన్నారు. వీళ్లు​ ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో ఆ దేశ పౌరసత్వం ఉంది.

మూడేళ్ల కిందట హైదరాబాద్​కు​..:

ఆస్తి పంపకాల విషయమై సాజిద్​ మూడేళ్ల కిందట చివరిసారిగా హైదరాబాద్​ వచ్చాడు. అతని తండ్రి సౌదీ అరేబియాలో పనిచేసి వచ్చాక, ఇక్కడ ఒక అపార్ట్​మెంట్​ కొన్నాడు. ఈ ఆస్తి విషయమై సోదరులు, కుటుంబసభ్యులతో సాజిద్​కు గొడవలు తలెత్తాయి. కాగా, సాజిద్​ ఆస్ట్రేలియాలో స్థిరపడిన అనంతరం ఇప్పటివరకు కనీసం మూడు సార్లు భారత్​కు వచ్చినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. సాజిద్​కు ఇద్దరు సోదరులు సహా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వాళ్లెవరితోనూ అతనికి సత్సంబంధాలు లేవు. ఆఖరికి వృద్ధురాలైన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికి పట్టించుకోలేదని బంధువులు అంటున్నారు.

మరోవైపు గత నవంబర్​లో కుమారుడితో కలసి సాజిద్​ ఫిలిప్పీన్స్​ వెళ్లినట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. సాజిద్.. భారత పాస్​పోర్టు మీద, అతని కుమారుడు నవీద్​ ఆస్ట్రేలియా పాస్​పోర్ట్​ మీద వెళ్లినట్లు తేలింది. ఫిలిప్పీన్స్​లో 28 రోజులు ఉన్న అనంతరం అక్కడి నుంచి మరో దేశాన్ని గమ్యస్థానంగా చూపుతూ వెళ్లిపోయారు. కాగా, నిందితుడు పలుసార్లు పాకిస్థాన్​కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సమన్వయం చేసుకుంటూ భారత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాస్​పోర్ట్​ అసలుదేనా? సాజిద్​ భారత పౌరుడేనా? అతనికి ఉగ్ర లింకులు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, హైదరాబాద్​ పోలీసు అధికారులు కలసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

కాగా, ఈ నెల 14న ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్​లో సాజిద్​, అతని కుమారుడు నవీద్​ పర్యాటకులపై కాల్పుల (Bondi Beach) కు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దురాగతంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు. మొదట కోమాలో ఉన్న నవీద్ అక్బర్ అనంతరం ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చాడు.

Read Also: ఢిల్లీలో సోనియా గాంధీని క‌లిసిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>