కలం, వెబ్డెస్క్: సోషల్ మీడియాను అతిగా వాడకుండా తమ పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తామని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్(Neal Mohan) అన్నారు. ఉత్తమ సీఈవోగా ‘టైమ్స్ 2025 సీఈవో ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైన ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పిల్లలు యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ అధికంగా వాడుతున్నారని, ఫలితంగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారని ఆందోళనలు పెరుగుతుండడంపై ఆయన స్పందించారు.‘ మా పిల్లలు సోషల్ మీడియా అతిగా వాడకుండా నేను, నా భార్య హేమ మోహన్ ఆంక్షలు అమలుచేస్తాం. మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతంలో మరింత కఠినంగా ఉంటాం.
వాళ్లు సాధ్యమైనంత తక్కువగా సోషల్ మీడియా వాడేలా చూస్తాం. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం కారణంగానే ఈ ఆంక్షలు పెట్టాల్సి వస్తోంది. యూట్యూబ్ సీఈవోగా ఆది నా బాధ్యత’ అని నీల్ మోహన్ అన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అత్యున్నత బాధ్యత ఉందని, పిల్లలు సోషల్ మీడియాను ఎందుకు? ఏ విధంగా వాడుతున్నారో గమనిస్తుండడం కూడా అందులో భాగమని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన నేపథ్యంలో ఆయన(Neal Mohan) వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also: దేశ వ్యాప్తంగా రూ.21వేల కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్..!
Follow Us On: Youtube


