కలం, వెబ్ డెస్క్: ఒక దేశాధినేతను హత్య చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడం మన దేశ ప్రతిష్ఠకు భంగమని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ ఘర్షణలపై స్పందిస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్పై ఏకపక్ష దాడులను, అలాగే గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ చేస్తున్న దాడులను ప్రధాని ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై తగ్గిస్తుంది’ అని అన్నారు.
‘ఈ సంక్షోభ సమయంలో మనదేశం నైతికంగా స్పష్టతతో వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మనుషుల ప్రాణరక్షణ కోసం స్పష్టంగా మాట్లాడే ధైర్యం ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమాధికారం, శాంతియుత పరిష్కారాల పునాదులపై ఆధారపడి ఉంది. అది స్థిరంగా కొనసాగాలి’ అని రాహుల్ చెప్పారు.
ఉద్రిక్తతలు మరింత పెరిగి పరిస్థితి విస్తృత యుద్ధం వైపు మళ్లుతోందని రాహుల్ అన్నారు. దీనివల్ల పశ్చిమాసియాలోని కోట్లాది ప్రజలు, అందులో దాదాపు కోటి మంది భారతీయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘భద్రతా ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయి. హింస మరింత హింసకు దారితీస్తుంది. సంయమనం, దౌత్యం మాత్రమే శాంతికి మార్గం’ అని ఆయన(Rahul Gandhi) అన్నారు.
దీనిపై ప్రధాని మోదీ స్పష్టంగా స్పందించాలని రాహుల్ కోరారు. ఒక దేశాధినేత హత్యను పీఎం సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఇరాన్ సంక్షోభంపై, అయతొల్లా ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ స్పందించడం లేదంటూ అంతకుముందు సోనియా గాంధీ సైతం విమర్శించిన సంగతి తెలిసిందే.

