కలం, వెబ్ డెస్క్: ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు మ్యాట్రి మోనీ (Matrimony) పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలుగా నటిస్తూ పెళ్లి పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏపీలోని విశాఖపట్నానికి చెందిన కేతిరెడ్డి ప్రసన్న కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో అందమైన యువతిగా నకిలీ ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమాయకులను బురిడీ కొట్టించేవాడు. కేవలం మ్యాట్రిమోనీకే పరిమితం కాకుండా, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయంటూ వసూళ్లకు పాల్పడ్డాడు.
ప్రసన్న కుమార్ కంబోడియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అక్కడి నుండే ఇండియన్స్ (Indians)ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై నిఘా ఉంచిన హైదరాబాద్ పోలీసులు, నిందితుడు కంబోడియా నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కీలకమైన ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అతని మోసాలపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

