కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు కేవలం జస్ప్రీత్ బుమ్రాపైనే అతిగా ఆధారపడుతోందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) అభిప్రాయపడ్డారు. గురువారం జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో సవాళ్లు పొంచి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపిస్తున్నారని, అయితే కఠిన పరిస్థితుల్లో ఇతర బౌలర్లు ఇంకా పరీక్షకు గురికాలేదని డుప్లెసిస్ పేర్కొన్నారు.
ప్రత్యర్థి బ్యాటర్లు ఇతర బౌలర్లపై ఒత్తిడి పెంచితే, ఆరో బౌలింగ్ ఆప్షన్గా ఉన్న శివమ్ దూబే వంటి వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలోని ఈ జట్టులో బుమ్రా మినహా మిగిలిన పేసర్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా, బ్యాటింగ్ ఆర్డర్లో జరుగుతున్న మార్పులపై కూడా డుప్లెసిస్ (Faf du Plessis) స్పందించారు.
సంజూ శాంసన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల స్థానాల్లో అనిశ్చితి నెలకొందని, స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్లే మెరుగ్గా రాణిస్తాయని ఆయన గుర్తుచేశారు. చెన్నై వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను భారత్ సమర్థవంతంగా నిరోధించింది. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో రాణించడంతో భారత్ విజయం సాధించింది. ఇక సెమీఫైనల్ చేరాలంటే మార్చి 1న ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగే కీలక పోరులో భారత్ తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జట్టు సమష్టిగా రాణించడంపైనే అందరి దృష్టి నెలకొంది.

