కలం, వెబ్ డెస్క్: అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అవినీతి జరిగిందని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Rama Krishna) సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, లింగమనేని రమేశ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు. వీరందరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని రూ.8 లక్షలకే అమ్మేశారని చెప్పారు. ఈ అవినీతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా భాగం ఉందని ఆరోపించారు.
లింగమనేని రమేష్కు మేలు చేసేందుకు ఆయన భూముల పక్క నుంచే సీఎం చంద్రబాబు రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, దానికి ప్రతిఫలంగా లింగమనేని హెరిటేజ్కు కంతేరు గ్రామ సమీపంలో 18 ఎకరాలు అమ్మారన్నారు. రాజధాని ప్రకటన తర్వాత కంతేరుర, ఖాజా, సీఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరాకు రూ.3 నుంచి రూ.4 కోట్లకు పెరిగిందన్నారు. మరి లింగమనేని రూ.8 లక్షలకు ఎలా అమ్మారని ప్రశ్నించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా గతంలోనే లింగమనేని ఇదే ధరతో రెండున్నర ఎకరాలు అమ్మారని తెలిపారు. ఎందుకు అంత చౌక ధరకు భూములు అమ్ముకున్నారని ప్రశ్నించారు.
లింగమనేని కరకట్టలో ఉన్న తన ఖరీదైన ఇంటిని చంద్రబాబుకు ఉచితంగానే ఇచ్చేశాడని ఆళ్ల ఆరోపించారు. ఇవన్నీ సాక్ష్యాధారాలు ఆర్టీఏ ద్వారా సేకరించుకొని సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఐడీ ఆధారాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్, లింగమనేని, అంజనీ కుమార్, మంత్రి నారాయణ సతీమణి, వారి బంధువులు, ఇతర కంపెనీలను నిందితులుగా చేర్చి చార్జ్షీట్ కూడా వేసినట్లు గుర్తు చేశారు. ఇది ఇంతటితో ఆగిపోదని, ఈ కేసులో తప్పకుండా చంద్రబాబుతో సహా అందరికీ శిక్ష పడుతుందని చెప్పారు.

