కలం, వెబ్ డెస్క్: వైసీపీని వదిలి వెళ్లిన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ నాయకుడు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి (Kethireddy Venkatarami Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్ట కాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా పార్టీలోకి వస్తానంటే చెప్పుతో ముద్ర పడేలా కొడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. నాయకుడు అంటే రాజకీయాల కోసమే బతకొద్దని, క్యారెక్టర్ కోసం కూడా బతకాలని చెప్పారు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిన వారిని బంధు ప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తానంటే సహించేది లేదన్నారు. శత్రువునైనా పార్టీలో చేర్చుకుంటాం కానీ వెన్నుపోటు దారులను క్షమించేది లేదన్నారు. సంపాదన కోసమో లేక సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడం కోసమే వేరే పార్టీలోకి వెళ్లిన వారిని దగ్గరకు రానివ్వొద్దని సూచించారు. అలాంటి వారిని దూరం పెట్టి క్రమశిక్షణతో వైసీపీని ధర్మవరంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

