కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru)లో దొంగలు రాగి కోసం బరితెగిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ ఏకంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి, అందులోని రాగి, అల్యూమినియం వంటి విలువైన లోహాలను తస్కరిస్తున్నారు.
సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటపతినగర్ ప్రాంతంలో గల కోడిపుంజుల వాగు పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రాల్లో మోటర్లు ఆన్ చేయడానికి వెళ్లిన రైతులు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమై ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. దొంగలు లోపలి లోహాలను అపహరించినట్లు గుర్తించిన రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏడీఈ ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురికావడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లనే దొంగిలిస్తుంటే, ఇక ఇళ్లకు రక్షణ ఏముంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించి తమకు భరోసా కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

