కలం, వెబ్ డెస్క్: తెల్లారితే ఆ ఇంట్లో పెళ్ళి.. అక్కాచెల్లెల్లు ఇద్దరికీ ఒకే రోజు వివాహం.. పందిళ్లు.. బాజాలు.. మంగళ తోరణాలు.. అన్నీ సిద్ధమయ్యాయి.. చుట్టాలతో, వచ్చేపోయేవాళ్లతో ఆ ఇల్లు సందడిగా ఉంది.. ఇంతలో హఠాత్తుగా కలకలం.. పెళ్లి పీటలెక్కాల్సిన అక్కచెల్లెల్లిద్దరూ గదిలో అచేతనంగా పడి ఉన్నారు(Two Sisters Die).. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు.. అయితే, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆ అక్కాచెల్లెల్లు లోకాన్ని విడిచిపెట్టారు. ఈ సంఘటన.. రాజస్థాన్లో (Rajasthan) జరిగింది.
జోధ్పూర్ (Jodhpur) జిల్లా మనాయ్ గ్రామంలో నివసించే శోభ(25), విమల(23) టీచర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఒకే రోజు ఒకే వేదికపై వేర్వేరు పెళ్లికుమారులతో శనివారం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సన్నాహాలు సందడిగా మొదలయ్యాయి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అనంతరం తెల్లవారు జామున అక్కచెల్లెల్లిద్దరినీ పెళ్లి కూతుళ్లుగా చేసేందుకు తలుపు తట్టగా, ఎంతసేపటికీ తీయలేదు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి, లోపలకి వెళ్లి చూసేసరికి ఇద్దరూ మంచంమీద అచేతనంగా పడి ఉన్నారు. అంబులెన్స్లో వాళ్లను హాస్పిటల్కు తీసుకెళ్లేసరికే వాళ్ల ప్రాణాలు పోయాయి. మృతదేహాలు నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో వాళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
తల్లిదండ్రులు తమకు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతోనే వీళ్లు బలవంతంగా ప్రాణాలు (Two Sisters Die) తీసుకున్నారని పెళ్లికూతుళ్ల మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు మొదట చూసిన సంబంధం నచ్చిందని, ఆ ఇద్దరితోనే వివాహం జరిపించాలని కోరగా తల్లిదండ్రులు అంగీకరించలేదని ఆయన చెప్పారు. దీంతో పెళ్లికుమార్తెల తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ప్రధాని మోదీ
Follow Us On: Sharechat


