కలం, వరంగల్ బ్యూరో: సైబరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు (Warangal Police) అద్బుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఆరురోజుల పాటు జరిగిన ఈ క్రీడలు శనివారం రాత్రి ముగిశాయి. వరంగల్ కమిషనరేట్కు చెందిన క్రీడాకారులు 86 పతకాలను సాధించి మూడో స్థానంలో నిలిచారు. 12 స్వర్ణాలు, 25 రజతాలు, 49 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఆర్చరీ క్రీడలో అత్యధికంగా ఐదు బంగారు పతకాలతోసహా మొత్తం 13 పతకాలను సాధించారు. జూడో క్రీడలో వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులు నాలుగు రజత పతకాలను సాధించి జూడో చాంపియన్షిప్ రన్నరప్గా నిలిచారు.
బాక్సింగ్, ఆర్మ్స్ రెజ్లింగ్, రెజ్లింగ్, వెయిట్ లిప్టింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, సైక్లింగ్, స్మిమ్మింగ్, హాకీ విభాగాల్లో గతంలో కన్నా మెరుగైన ఆట తీరు చూపించారు. ప్రధానంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సైతం కాంస్య పతకాన్ని సాధించడం విశేషం. అలాగే వరంగల్ పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పుట్బాల్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించి క్రీడాకారుల్లో జోష్ను నింపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రోత్సాహం వల్లే తాము పతకాలు సాధించగలిగామని పోలీస్ క్రీడాకారులు తెలిపారు.


