కలం, ఖమ్మం బ్యూరో: నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ మొట్ట మొదటి మేయర్ (Mayor) మూడ్ గణేష్ (Mood Ganesh) చాలా అదృష్ట వంతుడని కార్పొరేషన్ ప్రజలు చర్చించుకుంటున్నారు. గణేష్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, వ్యవసాయం చేస్తూ,ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి కొన్నేళ్ల పాటు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాడు. అనంతరం ఎంపీటీసీగా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్(Congress) పార్టీకి మెజార్టీ (28) ఉంది కానీ సీపీఐ పార్టీ (CPI)కి మెజార్టీ(23) లేదు. మెజార్టీ లేకపోయినా సీపీఐ నుంచి మేయర్ అవ్వడం మామూలు అదృష్టం కాదు. ఎందుకంటే రాష్ట్రంలోని చాలా చోట్ల మెజార్టీ లేకపోయినా ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నది. కానీ, కొత్తగూడెంలో మాత్రం 28 కార్పొరేటర్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా చాలా స్మూత్గా ఎలాంటి గొడవలు లేకుండా సీపీఐకి అధికారం అప్పగించడం గమనార్హం. ఇంకో పక్క మహిళా సాధికారతకు ఎర్ర జెండా పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాయి. కానీ కొత్తగూడెంలో ఇద్దరు మహిళలు పోటీలో ఉన్నప్పటికీ మేయర్ పీఠం మూడ్ గణేష్ను వరించడం అదృష్టమేనని పలువురు చర్చించుకుంటున్నారు.


