కలం, తెలంగాణ బ్యూరో: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సీ) ప్రకారం ఆయనను ఆ స్థానం నుంచి తొలగించాలని కాంగ్రెస్ చీఫ్ విప్ కే.సురేశ్ ఆ నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 120 మంది విపక్ష పార్టీల సభ్యులు ఆ నోటీసుపై సంతకం చేశారు. కాంగ్రెస్తో పాటు డీఎంకే, సమాజ్వాదీ పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సంతకం చేయడానికి నిరాకరించి, ఈ వ్యవహారానికి సంబంధం లేదని ప్రకటించారు. మొత్తం మూడు అంశాలను ఆ నోటీసులో కాంగ్రెస్ చీఫ్ విప్ సహా సంతకాలు చేసిన విపక్ష ఎంపీలు పేర్కొన్నారు.
సభ మొత్తానికి కస్టోడియన్గా ఉండే స్పీకర్ (Speaker Om Birla) విపక్షాల సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తటస్థ పాత్ర పోషించడంలేదని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీన ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్గాంధీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఆ మరుసటి రోజు విపక్షాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులను స్పీకర్ ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారని, ఫిబ్రవరి 4వ తేదీన ఓ బీజేపీ ఎంపీ ఇద్దరు మాజీ ప్రధానుల మీద అభ్యంతరకరమైన తీరులో కామెంట్లు చేసి మాటల దాడికి పాల్పడ్డారని, సభా సంప్రదాయాలు మంట గలుస్తున్నా స్పీకర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆ నోటీసులో ఎంపీలు పేర్కొన్నారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు రెండు రోజులుగా విపక్ష ఎంపీలు సమావేశమై చివరకు తీర్మానాన్ని ఆమోదించి దాన్ని జతచేసి లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో నోటీసును అందజేశారు.
Read Also: ఆంథ్రోపిక్ కీలక ఉద్యోగి రాజీనామా.. టెక్ వరల్డ్లో కలకలం
Follow Us On: Sharechat


