కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ (Yadadri Temple) నిర్మాణ భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత బీఆర్ఎస్ (BRS) సర్కారు హయాంలో దాదాపు రూ.2వేల కోట్ల వ్యయంతో కృష్ణశిలలతో పునర్నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ కనిపిస్తున్న పగుళ్లు, భద్రతా పరమైన లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన ఆలయ ఉపరితలంతో పాటు, క్యూ లైన్లు, స్తంభాలపై కొన్ని చోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో గర్భాలయం పరిసరాల్లో నీరు లీక్ అవ్వడం వంటి ఘటనలు గతంలోనే కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నిర్మాణ లోపాలు వెలుగుచూశాయి. కొండపైన నిర్మించిన రథశాల (Rathashala) ఎప్పుడు కూలిపోతుందో అనే భయాందోళన ప్రజల్లో నెలకొంది. రథశాలకు సంబంధించిన పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కోతులు వాటి మీదకి ఎక్కితే చాలు.. ఆ పిల్లర్లు అటు ఇటు కదులుతున్నాయి. అయితే రథశాల షట్టర్కు ఆకట్టుకునేలా తిరు నామాలను గీయడంతో.. భక్తులు అక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సమయంలో కోతులు దూకడం వల్ల అవి కూలి భక్తుల మీద పడే ప్రమాదం ఉంది .
కుంగిన నేల.. పగిలిన బండళ్లు..
నిజానికి యాదాద్రి ఆలయ (Yadadri Temple) పునర్మిణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఏళ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉండాల్సిన రాతి కట్టడంలో కొద్ది కాలానికే పగుళ్లు బారడం.. మరమ్మత్తులు చేయాల్సి రావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రధానాలయంతో పాటు కొండపైన చాలాచోట్ల నిర్మాణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల కొండపైనే నేల కుంగింది. బండలు పగుళ్లు బారాయి. ప్రోటోకాల్ ఆఫీసు వద్ద నేలపై వేసిన బండలు పగిలి ముక్కలయ్యాయి. పెద్దగా జనాల తాకిడి లేని ప్రోటోకాల్ ఆఫీసు పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


