కలం, వెబ్ డెస్క్ : పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. సోమవారం ‘ఈ-ఆఫీస్’ (e-Office) విధానాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాగిత రహిత పాలన ద్వారా ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం తగ్గుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ పాలన దార్శనికతకు అనుగుణంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ-ఆఫీస్ (e-Office) ద్వారా సమాచారం అత్యంత సురక్షితంగా ఉండటమే కాకుండా ఎక్కడి నుండైనా ఫైళ్లను తనిఖీ చేసే వీలుంటుంది. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డిసిపి ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డిసిపి వై.వి.ఎస్. సుధీంద్ర పాల్గొన్నారు.



