కలం, వెబ్ డెస్క్ : దేశానికి గాంధీ గారు ఏ విధంగా జాతిపిత అయ్యారో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు కూడా ఈ రాష్ట్రానికి జాతిపితనే అని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఉద్దేశించి హరీశ్ రావు మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేషపూరిత ప్రసంగాల వల్ల కలిగే నష్టాల గురించి హితబోధ చేసిన కొద్ది నిమిషాల్లోనే, అదే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రసంగాలు వింటే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తన కడుపులో ఉన్న కత్తులను, నోటిలోని విషాన్ని ప్రసంగం ద్వారా బయటపెట్టి తన అజీర్తిని, అక్కసును మరోసారి ప్రదర్శించారని హరీశ్ రావు అన్నారు. అమెరికా వెళ్లి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులు చదువుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి తన పాత గుణాన్ని మార్చుకోలేదని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటల్లో కనీస సంస్కారం లేదని, చిల్లర మాటలు, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నాలుగు కోట్ల ప్రజలు ఏకమై పోరాడుతుంటే, అప్పుడు ఆంధ్రా పాలకుల వద్ద మోకరిల్లిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ గురించి లేదా ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన గుర్తు చేశారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పాలన, ప్రజాస్వామ్యం గురించి అర్థం కాదని, ఆయన హార్వర్డ్ వెళ్లినా లేదా అంతరిక్షానికి వెళ్లినా ఆయన ప్రవర్తన, నోటి మురికి మారదని హరీశ్ రావు విమర్శించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ పై రేవంత్ సంచలన కామెంట్స్
Follow Us On: Instagram


