కలం, వెబ్డెస్క్: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీని కొంటానంటూ సీరమ్ ఇన్స్టిట్యూట్ యజమాని, బిజినెస్మాగ్నెట్ అదర్ పూనావాలా సహా పలువురు బిలియనీర్లు ముందుకొచ్చారు. అయితే, తాను కూడా ఆర్సీబీని కొంటానంటూ.. తీవ్ర ఆర్థిక నేరాల ఆరోపణలు, ఈడీ కేసులతో రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) లెటర్ రాయడం సంచనలం కలిగిస్తోంది. ఈ మేరకు ఆర్సీబీని కొనడానికి ఆసక్తి చూపిస్తూ జైలు నుంచే ఆయన లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) రాసి, తన లాయర్ ద్వారా ఆర్సీబీ ఓనర్స్కు పంపారు.
లేఖలో.. తనను ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీకి చైర్మన్గా, ప్రమోటర్గా పేర్కొన్న సుఖేశ్.. ఆర్సీబీ ఓనర్స్ అయిన డియాగో గ్రూప్కు ఈ లెటర్ పంపారు. ఆర్సీబీ అమ్మకానికి ఉందనే విషయం తెలిసిందని, అందుకే ఈ ఆఫర్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ ప్రకారం ఆర్సీబీ వాల్యూను అనుసరించి, ఫ్రాంఛైజీపై అన్ని హక్కులనూ 100 బిలియన్ డాలర్లకు (రూ.9వేల కోట్లకుపైనే) కొనేందుకు సిద్ధమని ఆ లేఖలో వివరించారు. మొత్తం సొమ్మును నగదుగా, మూడో పార్టీ ప్రమేయం అవసరం లేకుండా 48 గంటల్లో చెల్లిస్తానని పేర్కొన్నారు.
ఆర్సీబీ జట్టుకు, ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించనని హామీ ఇచ్చారు. ఏదైనా స్పోర్ట్స్ జట్టును కొనాలనేది తన ప్రేయసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆశ అని, ఆర్సీబీని కొని ఆమెకు గిఫ్ట్గా ఇస్తానని ఆ లేఖలో తెలిపారు. తనపై ఉన్న కేసులన్నీ కేవలం ఆరోపణలని, తాను నేరం చేసినట్లు ఏ కోర్టులోనూ నిరూపించలేరన్నారు.
ఎల్ఎస్ హోల్డింగ్స్ మీద ఎలాంటి కేసులూ లేవని, ఈ కంపెనీ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో రిజిస్టర్ అయినందున ఎలాంటి భయం అక్కర్లేదని చెప్పారు. ఈ కంపెనీ అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్, హాంగ్కాంగ్, దుబాయ్, రష్యా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆర్సీబీని తనకు అమ్మాలనుకుంటే పర్సనల్గా మీటింగ్కూ హాజరవుతానని తెలిపారు. తన లెటర్పై సమాధానం కోసం ఎదురుచూస్తుంటానని చెప్పారు.
ఎవరీ సుఖేశ్ చంద్రశేఖర్?
సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) కు ఆర్థిక ప్రపంచంలో మాయలమరాఠీగా పేరుంది. బెంగళూరుకు చెందిన సుఖేశ్ తండ్రి రబ్బర్ కాంట్రాక్టర్. వీళ్లది సాధారణ మధ్య తరగతి కుటుంబం. సుఖేశ్… విలాసవంతమైన జీవితం గడపడం కోసం డిగ్రీ నుంచే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. మొదట కర్ణాటక ప్రభుత్వంలో ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. అప్పటి నుంచే అతని మోసాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఒక్క బెంగళూరులోనే సుమారు 40కి పైగా కేసులు అతనిపై నమోదయ్యాయి.
ఆ తర్వాత ముంబైకి మకాం మార్చాడు. ప్రముఖుల కుమారుడినని, బంధువునని చెప్పుకుంటూ అనేక ఆర్థిక నేరాలకు, బెదిరింపులకు పాల్పడ్డారు. అతని ట్రాప్లో చిక్కి ఎంతో మంది డబ్బులు అర్పించుకున్నారు. తద్వారా రూ.వేల కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ హీరోయిన్లను వెంట తిప్పుకున్నారు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం ఇతని మోసాలకు బలైంది. ఈ క్రమంలో సుఖేశ్ నేరాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.
అయితే, అక్కడా తన దందా ఆపలేదు. బెయిల్ ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ప్రముఖ ఫార్మా కంపెనీ ఓనర్ శివిందర్ మోహన్సింగ్ నుంచి రూ.200 కోట్లు కొట్టేశారు. జైలు అధికారులను, సిబ్బందిని సైతం లంచాలతో బోల్తా కొట్టించి, తన పనులు సాఫీగా చేయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్న సుఖేశ్ వద్ద రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెప్తున్నారు.


