కలం, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) సొంత గూటికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ (BRS) కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం ఆరూరి రమేష్ బీజేపీ(BJP)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే తిరిగి బీఆర్ఎస్ చేరారు. ఆరూరి రమేష్ వర్ధన్నపేట్ నుంచి 600 కార్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరూరి రమేష్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఎక్కువ రోజులు బీజేపీలో ఉండలేకపోయారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆరూరి రమేష్ (Aroori Ramesh) కాంగ్రెస్లో చేరతారని, కొందరు మళ్లీ బీఆర్ఎస్ వస్తారని కొందరు… ఇలా పలు ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలోని పార్టీ కేడర్లో ఉత్సాహం నెలకొంది.
సమస్యలుంటే పరిష్కరించుకుందాం: కేటీఆర్
పార్టీలో అంతర్గతంగా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏవైనా ఇబ్బందులుంటే వాటిని నాలుగు గోడల మధ్యే చర్చించుకోవాలని సూచించారు. పోలింగ్ నాడు మాత్రం అంతా కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వారికి ఓటు వేసి గెలిపించాలని.. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. ఆరూరి రమేశ్ చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
బీజేపీకి నో స్పేస్: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అసలు ఎటువంటి అవకాశం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఓ ఏడాది గడిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ వైపే క్యూ కడతారని చెప్పారు. కానీ తాము ఎవర్నీ చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
కడియం వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడా : ఆరూరి రమేశ్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన కడియం శ్రీహరి దుర్మార్గుడని బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆరూరి రమేశ్ అన్నారు. కడియం శ్రీహరి ఎన్నికల కంటే ముందే రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పార్టీకి ద్రోహం చేశారని పేర్కొన్నారు. తనకు కేసీఆర్ మీద ఎటువంటి కోపం లేదని.. బీజేపీలో చేరినా ఆయనను పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ద్రోహం తలపెట్టారని పేర్కొన్నారు. తాను విధి లేని పరిస్థితుల్లో బీజేపీలో చేరినట్టు చెప్పుకున్నారు.
Read Also: హనుమకొండ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా కేటీఆర్..?
Follow Us On : WhatsApp


