కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ అర్బన్ బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Bigala Ganesh) షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజమాబాద్ లో డివిజన్ వైజ్ సీసీ రోడ్లు, బ్రిడ్జిలు తమ హయాంలో ప్లాన్ చేసి రూ.100 కోట్లు మంజూరు చేయించి.. పనులు ప్రారంభించామని తెలిపారు. తాము మొదలు పెట్టిన పనులకు.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ నిధుల మంజూరు, భూమిపూజ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.100 కోట్లు బీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశారని.. ఆ జీవో కాపీలను, శిలాఫలకాల ఫోటోలను మీడియా ముందు చూపించారు గణేష్. TUFIDC ద్వారా గతంలో రూ.60 కోట్ల జీవో తీసుకొచ్చింది తామే అని.. బిగాల గుర్తు చేశారు. ఆ జీవోకు సంబంధించిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని చెప్పారు. పైగా ఇప్పుడు పాత జీవోల్లో తేదీలు మార్చి కాంగ్రెస్, బీజేపీ నేతలు వారే తెచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారంటూ గణేష్ గుప్తా మండిపడ్డారు.
నిజామాబాద్ లో పర్యటించిన గణేష్..
నిజామాబాద్ లో (Nizamabad) మాజీ ఎమ్మెల్యే గణేష్ విస్తృతంగా పర్యటించారు. ఖలీల్ వాడిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించారు. బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎంపీ అర్వింద్ లు శంబుని గుడి వద్ద ఉన్న దుకాణాలను ఎందుకు తరలించట్లేదని ప్రశ్నించారు. గోడల మీద రాతలు కాకుండా.. నగర అభివృద్ధికి కృషి చేయాలని గణేష్ గుప్తా చెప్పారు. బీఆర్ ఎస్ హయాంలో మార్కెట్ పనులు సింహ భాగం పూర్తయ్యాయని.. మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారంటూ మండిపడ్డారు గణేష్. శంబుని గుడి పక్కన ఉన్న దుకాణాలను తొలగించి వారికి ఈ మార్కెట్ లో షాప్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు ఎక్కడ..?
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Bigala Ganesh) విమర్శించారు. నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ హత్య జరిగిందని.. మరో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ పై వాహనం ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు గణేష్. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నగర ఆధ్యక్షులు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ ఠాకూర్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షహజాద్, అబ్దుల్ మతీన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ఏ విచారణకైనా సిద్ధం : మంత్రి కోమటిరెడ్డి
Follow Us On : WhatsApp


