కలం, వెబ్డెస్క్: ఓ చిన్నారి ఫోన్ కాల్ మూడు ప్రాణాలను కాపాడింది. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో ఆ చిన్నారి వ్యవహరించిన తీరు తనతోపాటు మరో ఇద్దరిని చావు నుంచి బయటపడేసింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్విలే సిటీలో జరిగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ భారతీయ కుటుంబంలో జరిగిన గొడవ (Family Shooting in US) ఐదుగురిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్(51), మీను డోగ్రా (43) దంపతులకు ముగ్గురు పిల్లలు. వీళ్ల ఇంటికి బంధువులు గౌరవ్ కుమార్(33), నిధి చందర్(37), హరీష్ చందర్(38) వచ్చారు.
అనంతరం ఏదో విషయమై గొడవ జరగడంతో కుమార్ తన తుపాకీతో కాల్పులు జరిపాడు (Family Shooting in US). దీంతో గౌరవ్, నిధి, హరీష్, మీను అక్కడికక్కడే చనిపోయారు. కాల్పుల విషయం తెలిసి స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి విజయ్ కుమార్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తమకు కాల్ చేసింది నిందితుని పిల్లల్లో ఒకరని పోలీసులు వెల్లడించారు. తాము సమయానికి రాకపోతే నిందితుడు వాళ్లను కూడా బలి తీసుకునేవాడని చెప్పారు. కాగా, కాల్పుల శబ్దం విని మేల్కొన్న చిన్నారులు, వెంటనే భయంతో అండర్ గ్రౌండ్లోని ఇంట్లో దాక్కున్నారు. అక్కడి నుంచే ఓ చిన్నారి 911 నెంబర్ ద్వారా పోలీసులకు కాల్ చేయడంతో, పోలీసులు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో పిల్లల ప్రాణాలు నిలిచాయి. వాళ్లను బంధువు ఒకరు తన ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఈ దుర్ఘటనపై విచారం తెలుపుతూ, చిన్నారులకు అండగా ఉంటామని అమెరికాలోని భారత ఎంబసీ ప్రకటించింది.


