కలం, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్(ఈవీఎం)ల మీద అనుమానాలు, వివాదాలు, చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka) రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి గ్రేటర్ బెంగళూరు అథారిటీ(జీబీఏ) ఎన్నికలను ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ల (Ballot Papers) తో నిర్వహించనుంది. ఈ మేరకు కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధానాధికారి జి.ఎస్.సంగ్రేషి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కచ్చితంగా ఈవీఎంలతోనే జరపాలి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరపవద్దని ఎలాంటి నిబంధన లేదు. ఏ కోర్టూ చెప్పలేదు. అందుకే మేము బ్యాలెట్ పద్ధతి ఎంచుకున్నాం. వేరే ఏ కారణం లేదు. దీనిపై అన్ని రాజకీయ పక్షాలతోనూ సంప్రదింపులు జరిపాం’ అని సంగ్రేషి అన్నారు.
కర్ణాటకలో స్థానిక ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ల (Karnataka Ballot Papers) తోనే నిర్వహించాలని సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి చేసిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. దీనిపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ప్రజల నమ్మకం, క్రెడిబిలిటీ కోల్పోయినందువల్లే బ్యాలెట్ పద్ధతికి ఈసీ మళ్లినట్లు చెప్పారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తోంది. బ్యాలెట్ విధానంలో అక్రమాలు, హింస జరుగుతాయని వాదిస్తోంది.
కాగా, 2015లో బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) గా ఉన్న ప్రస్తుత జీబీఏ ఎన్నికలు ఈవీఎంలతోనే జరగడం గమనార్హం. ప్రస్తుతం స్టేట్ ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జీబీఏలో 88,91,411 ఓట్లు ఉన్నాయి. తుది ఓటర్ల జాబితా మార్చి 16న వెల్లడించనున్నారు. ఎన్నికలు ఈ ఏడాది మే 25, జూన్ 30 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మరికొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం
Follow Us On: Sharechat


