epaper
Monday, January 19, 2026
spot_img
epaper

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం

కలం, వెబ్​డెస్క్​: నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని (Rajiv Swagruha Plots Auction) తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్​గూడ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్​పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది, మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్​ వెల్లడించారు. ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

తమ ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని గౌతమ్​ తెలిపారు. మంచి కనెక్టివిటీ, వివాదాలు లేని క్లియర్ టైటిల్​తోపాటు ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేఔట్లను అభివృద్ధి చేయడం, కొన్న వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఈ ప్లాట్లు (plots) ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో భారీగా స్పందన రావడంతో మరోసారి ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నామని (Rajiv Swagruha Plots Auction) ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు నిర్ణీత డిపాజిట్​ను (EMD) మీ-సేవ కేంద్రాల్లో ఆన్​లైన్/యూపీఐతోపాటు డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.

ఓఆర్ఆర్-ఆదిభట్ల, ఐటీ కారిడార్​కు సమీపంలోని తొర్రూర్ లేఔట్​లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో; ఓఆర్​ఆర్ సమీపంలోని బహదూర్​పల్లి, శంషాబాద్ ఎయిర్​పోర్టుకు దగ్గరలోని కుర్మల్​గూడలోని ప్లాట్లకు ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్​సైట్​లో చూడవచ్చని వివరించారు. అలాగే ఫోన్ నెంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్​పల్లి),7993455802 (కుర్మల్​గూడ)లోనూ సంప్రదించవచ్చన్నారు.

ప్లాట్లు.. విస్తీర్ణం.. కనీస ధర
  • తొర్రూరు: ప్లాట్లు 105; విస్తీర్ణం 200–500 చ.గ. ; కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలు.
  • బహదూర్​పల్లి: ప్లాట్లు 12; విస్తీర్ణం 200-1000 చ.గ.; ఈ లేఔట్​లో కార్నర్ ​ప్లాట్​కు కనీస ధర చదరపు గజానికి రూ.30వేలు. ఇతర ప్లాట్లకు రూ.27 వేలు.
  • కుర్మల్​గూడ: ప్లాట్లు 20 ; విస్తీర్ణం 200-300 చ.గ.; కనీస ధర చదరపు గజానికి రూ.20 వేలు.
ధరావతు.. ఆఖరు తేదీ
  • తొర్రూర్ ప్లాట్ల కొనుగోలుకు రూ.2లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
  • బహదూర్​పల్లిలోని ప్లాట్లకు రూ.3లక్షలు, కుర్మల్​గూడలోని ప్లాట్లకు రూ.2లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>