కలం, వెబ్ డెస్క్: మహిళా అధికారులపై నిరాధార వార్తలు రాయడం అన్యాయమని ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) మండిపడ్డారు. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. మహిళల విషయంలో నిరాధార వార్తలు రాయడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ మీడియా చానల్లో మహిళా అధికారిపై వచ్చిన వార్తలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి కామెంట్లకు ప్రాధాన్యం సంతరించుకున్నది.
‘ఐఏఎస్ కావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా’ అంటూ ప్రశ్నించారు. మహిళా ఐఏఎస్ (Woman IAS) అధికారులపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మహిళా అధికారులకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. సరసాలు, రాసలీలలు మీకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెడ్డవాడు కాదని, ఆయన అందర్నీ ఆప్యాయతగా పలకరిస్తారని పేర్కొన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్చడంపై కూడా ఆమె స్పందించారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు. మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధాని మోదీకి లేదని స్పష్టం చేశారు. రాముడి పేరు పెడితే రాముడు కూడా క్షమించడని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఎక్కువకాలం సాగవని వ్యాఖ్యానించారు. మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు అని రేణుకా చౌదరి (Renuka Chowdhury) ప్రశ్నించారు. తమ డ్రెస్లకు డబ్బులు ఇస్తున్నారా అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
ఖమ్మం (Khammam) రాజకీయాలపై మాట్లాడిన రేణుక చౌదరి, ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. కేటీఆర్కు దమ్ముంటే తన గెలుపును ఆపగలడా ? అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ బలమే తన నమ్మకమని, ప్రజలే తన శక్తి అని ఆమె స్పష్టం చేశారు.
Read Also: ఉన్నావ్ కేసు.. కుల్దీప్ సింగ్ సెంగార్కు కోర్టు షాక్
Follow Us On: X(Twitter)


