కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని పురానాపూల్ (Puranapul) దర్వాజా మైసమ్మ ఆలయంలో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై తెలంగాణ బీజేపీ నాయకులు రామచంద్రరావు (Ramachandra Rao) తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లెక్సీలను చింపివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆలయాన్ని సందర్శించిన ఆయన, అక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ.. పురానాపూల్ దర్వాజా అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ బస చేసిన అత్యంత పవిత్రమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశమని గుర్తు చేశారు. అటువంటి చోట జరుగుతున్న ఈ దాడులు యాదృచ్ఛికం కాదని, వీటి వెనుక ఒక పథకం ప్రకారం జరుగుతున్న భారీ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఇటీవల సఫిల్గూడ ముత్యాలమ్మ ఆలయం, కీసర హనుమాన్ ఆలయాలపై జరిగిన వరుస దాడులను ప్రస్తావిస్తూ, తెలంగాణలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా వ్యవస్థీకృత దాడులు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇటువంటి శక్తులు బరితెగిస్తున్నాయని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం చెందడం వల్లే హిందువులలో అభద్రతా భావం పెరుగుతోందని మండిపడ్డారు. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి, అసలు దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రామచంద్రరావు (Ramachandra Rao) డిమాండ్ చేశారు.
Read Also: ఎమ్మెల్యే పోచారం తనువు బీఆర్ ఎస్ లో.. మనసు కాంగ్రెస్ లో..!
Follow Us On: Youtube


