కలం, వెబ్డెస్క్: నటుడు విజయ్ కథానాయకునిగా నటించిన ‘జన నాయగన్’ (Jan Nayagan) మూవీపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ చిక్కులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలతో నిర్మించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించింది. దీనిపై ‘జన నాయగన్’ సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశం కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం రాజేసింది. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘ఎక్ప్’ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలకు దిగారు. జన నాయగన్ను అడ్డుకోవడమంటే తమిళుల సంస్కృతిపై దాడికి దిగినట్లేనన్నారు.
‘సమాచార, ప్రసార శాఖ జన నాయగన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది తమిళుల సంస్కృతిపై దాడి చేయడమ. మోదీజీ.. తమిళుల గొంతును నొక్కడంలో మీరెప్పటికీ గెలుపొందలేరు’ అని తన ‘ట్వీట్’లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. తమిళనాడులో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో విజయ్(Actor Vijay) పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోనుందనే వార్తల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కాగా, రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రం నేరుగా స్పందించనప్పటికీ.. నిబంధనల ప్రకారమే జన నాయగన్కు సెన్సార్ నిరాకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
తమిళనాడులో సామాజిక మార్పు కోసం అంటూ టీవీకే పార్టీని రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్..‘జన నాయగన్’ తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్కు చిక్కులు ఎదురవుతున్నాయి. నిరుడు కరూర్లో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించడంపై ఇటీవల సీబీఐ విచారణకు విజయ్ హాజరయ్యారు. మరోవైపు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ‘జన నాయగన్’ మూవీకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.


