కలం, ఖమ్మం బ్యూరో : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి (Sankranti) వెలుగులు ముందే వచ్చాయి. ఖమ్మం (Khammam) జిల్లాలోని ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు కనులవిందుగా సాగాయి. మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సాయి ప్రభాత్ నగర్లో జరిగిన ఈ మెగా పోటీలకు మహిళా లోకం పోటెత్తింది. ఏకంగా 825 మంది మహిళలు రంగురంగుల రంగవల్లులతో ఏదులాపురం వీధులను ఇంద్రధనుస్సులా మార్చేశారు.
అబ్బురపరిచిన సృజనాత్మకత
మహిళలు కేవలం ముగ్గులు వేయడమే కాకుండా, వాటిలో సామాజిక అంశాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చొప్పించి తమ సృజనాత్మకతను చాటారు. రైతన్నకు భరోసా, మహిళా రక్షణ వంటి అంశాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజేతలకు ‘నగదు’ కానుకలు
పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆయన సతీమణి పొంగులేటి మాధురి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి: లక్ష్మిప్రసన్న (రూ. 30,000), ద్వితీయ బహుమతి: ఎన్. విజయ (రూ. 25,000), తృతీయ బహుమతి: కె. నిర్మల (రూ. 20,000), నాల్గవ, ఐదవ: వి. నాగమణి (15వేలు), వి. రమాదేవి (10వేలు), 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన వారికి తలా రూ. 5,000 అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను”. ఈ ముగ్గుల పోటీలు మన సంస్కృతికి అద్దం పడుతున్నాయి. 80 ఏళ్లు దాటిన వృద్ధురాలు కూడా ఈ వయస్సులో పోటీలో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఆమెకు ప్రత్యేకంగా రూ. 2 వేలు బహుమతిగా ఇచ్చారు. 11 నుంచి 20 స్థానాల వారికి రూ. 2వేలు చొప్పున, 21 నుంచి 30 స్థానాల వారికి ప్రత్యేక బహుమతులు అందజేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: తల్లిదండ్రుల సంరక్షణపై ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్
Follow Us On: Sharechat


