కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల రైతాంగానికి తీపి కబురు అందింది. ఏళ్ల తరబడి నీటి కోసం ఎదురుచూస్తున్న తుమ్మల చెరువు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే దిశగా కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ (Marellapadu Left Canal) ట్రయల్ రన్ విజయవంతమైంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో గోదావరి జలాలు కలకలలాడుతూ తుమ్మల చెరువు దిశగా పరుగులు తీయడంతో ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
గోదావరి జలాలను తుమ్మల చెరువుకు మళ్లించి రైతులకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాంత ప్రజల ఏళ్ల నాటి చిరకాల కోరిక. ఈ క్రమంలో నిర్వహించిన కెనాల్ ట్రయల్ రన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో రైతులు, అధికారులు, సిబ్బంది పరస్పరం స్వీట్లు తినిపించుకుని పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు.
ఎన్నో ఏళ్లుగా సాగునీటి కష్టాలు అనుభవిస్తున్న తమ పొలాలకు గోదావరి జలాలు చేరుతుండటంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. పచ్చని పంటలు పండించుకోవడానికి ఈ రోజు ఎంతో కీలకమని, ఇది తమకు నిజమైన పండుగ రోజని సంతోషం వ్యక్తంచేశారు. మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటి లభ్యత పెరగడంతో సాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయని, సాగు విస్తీర్ణం పెరిగి పంటలకు సంపూర్ణ భరోసా లభిస్తుందని ఆయకట్టు రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

