కలం, నిర్మల్ : తెలంగాణ శాసనసభ ఆవరణలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ ప్రాథమిక సమావేశం సోమవారం నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ్ల ప్రకాశ్, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా కమిటీ పర్యటించి అభిప్రాయ సేకరణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్న తీరును పరిశీలించి, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చర్చించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నివేదికలు, బ్యాంకు రుణాల మంజూరు, వార్షిక బడ్జెట్ తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

