కలం, వెబ్డెస్క్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యపై (Polytechnic Education) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవోపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కె.కేశవరావు చైర్మన్గా వ్యవహరించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్, శాంతా సిన్హా, నవీన్ మిట్టల్, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్లు సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను ఆధునికీకరించడం, విద్యార్థులు, ఇతర భాగస్వాముల విద్యా, ఉద్యోగ ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి, ఆధునిక ప్రయోగశాలలు, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లు, ఉపాధి అవకాశాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పాలిటెక్నిక్ వ్యవస్థలో ప్రతిపాదిత మార్పులపై విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఇతర వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా విధానం, ఈసెట్ ద్వారా ఉన్నత విద్య అవకాశాలు, ఫీజులు, ఉద్యోగుల సేవా నిబంధనలు, సంస్థల స్వరూపం వంటి అంశాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ హై లెవల్ కమిటీని నియమించింది.

