కలం, నిర్మల్ : కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది (KGBV Non-Teaching Staff), వర్కర్లకు నైట్ డ్యూటీలు రద్దు చేసి, వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్, సక్రమంగా సీఎల్లు, జాబ్ చార్ట్ అమలు చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడారు.
నిబంధనలకు విరుద్ధంగా అకౌంటెంట్లు, వర్కర్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. జాబ్ చార్ట్కు మించి పనులు చేయిస్తున్నారని, కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్న, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రూప, కవిత తదితరులు పాల్గొన్నారు.

