కలం, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ (Nagarkurnool), వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో నేడు ముగ్గురు తెలంగాణ మంత్రులు (Telangana Ministers) పర్యటించనున్నారు. వైద్య, ఆరోగ్య & ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహా (Damodar Raja Narasimha), రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సోమవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మొత్తం రూ.474.82 కోట్ల అంచనా వ్యయంతో వివిధ ప్రాంతాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) తొలి దశ ప్యాకేజీల కింద చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్లో రూ. 146.71 కోట్ల అంచనా వ్యయంతో 3 హ్యామ్ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో అమ్రాబాద్–ఇప్పలపల్లి రహదారి బలోపేతం, బల్మూర్–నాగర్కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారి విస్తరణ, అచ్చంపేట–రాకొండ రహదారి విస్తరణ పనులు ఉన్నాయి. అనంతరం వనపర్తిలో కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలోని దావాజిపల్లిలో రూ. 41.75 కోట్లతో, వీపనగండ్లలో రూ. 30.01 కోట్లతో, పెద్దదగడలో రూ.45.60 కోట్లతో, చిన్నంబావిలో రూ.39 కోట్లతో చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అలాగే పెంట్లవెల్లి మండలంలో రూ.171.75 కోట్ల అంచనా వ్యయంతో ఏడు రహదారి అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. పెంట్లవెల్లి–వనపర్తి, పెంట్లవెల్లి–శ్రీరంగాపూర్, పెద్దకార్పాముల–అంబట్పల్లి, రాజాపూర్–ఏదుల, కొల్లాపూర్–లింగాల, తీగలపల్లి–ఏదుల, షనాయిలపల్లి–గౌరెడ్డిపల్లి రహదారుల విస్తరణ, బలోపేతం పనులు ఇందులో ఉన్నాయి. ఈ పనులతో ఆయా ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడి, గ్రామాలు–మండల కేంద్రాలు–ప్రధాన పట్టణాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.

