కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. ఇది నిజంగా దురదృష్టకరమని, పొలిటికల్ క్లియరెన్స్ పేరిట పర్మిషన్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ముందుగానే విడుదలైందన్నారు.
విద్యపై ప్రత్యేక శ్రద్ధ…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు. వ్యవస్థను మార్చడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా.. విద్యతోనే సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతులు ఇవ్వకపోవడమేంటన్నారు. సరైన కారణం కూడా చెప్పలేదన్నారు. పొలిటికల్ కార్యక్రమం అని చెబుతున్నా అది ఏమాత్రం నిజం కాదన్నారు. తెలంగాణ దేశంలోనే భాగమని, తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది కదా.. అని ప్రశ్నించారు.

