కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Nizamabad GGH)లో రిమాండ్ ఖైదీ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. భిక్కనూరు పోలీస్ స్టేషన్లో లకావత్ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అతడిని ఇటీవల సారంగపూర్ జైలుకు తరలించారు. శనివారం సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
అయితే జైలు పోలీసుల ఎస్కార్ట్ మధ్య ఉన్న లకావత్ రాజు వారిని తప్పించుకుని జీజీహెచ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. దీంతో అతడి తలకు, ఛాతిలో బలమైన గాయాలయ్యాయి. హఠాత్తుగా జరిగిన ఈ ఘటన నుంచి తేరుకున్న పోలీసులు వెంటనే రాజును జీజీహెచ్ లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

