కలం, మునుగోడు (చండూరు): తాను అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట మీద నిలబడి ప్రమాణానికి రావాలని చండూరు మున్సిపల్ ఛైర్మన్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) సవాల్ విసిరారు. ప్రమాణానికి రాకపోతే మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఆయన్ను నమ్మరని స్పష్టం చేశారు. పండ్ల దుకాణాలు, ఆసుపత్రులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద తాను డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు కూసుకుంట్ల ఆరోపించారని.. ఎవరి దగ్గర తీసుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం శిర్దపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 9 గంటలకు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని తెలిపారు. కౌన్సిలర్లు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేస్తారని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

