కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మీ సేవ కేంద్రాల సేవలను (MeeSeva Centres) మరింత పారదర్శకంగా విస్తృత పరచాలని, సేవలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు ఆదేశించారు. మీ సేవ కేంద్రాల ద్వారా అత్యుత్తమ డిజిటల్ సేవలను ప్రజలకు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్ లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్కు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సీఎస్ సమావేశమై చర్చించారు.
కీలక అంశాలపై చర్చ..
ఈ సందర్భంగా మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో భాగంగా మీ సేవ కేంద్రాల ఆధునీకరణపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు.
డీపీఆర్లు సిద్ధం చేయాలి..
ఈ సందర్భంగా డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance)లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రంలో డిజిటల్ సామర్థ్యాల పెంపు, ఆధునిక టెక్నాలజీ వినియోగం, ప్రజా సేవల ట్రాన్సరెన్సీ, డేటా గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రపంచ బ్యాంక్ అందించగల అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై తమ అభిప్రాయాలను వివరించారు. ఇక దేశంలో డిజిటల్ రంగంలో ఇన్వెస్ట్ మెంట్ పెట్టేందుకు హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడుల కోసం డీపీఆర్లు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

