కలం, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుకు లోక్ సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులు ఉండగా.. 37కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 1956 చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. సుప్రీం కోర్టులో కేసుల భారం పెరుగుతుండటంతో ప్రస్తుత జడ్జిలపై ఒత్తిడి నెలకొంది.
ఇది చివరికి తీర్పుల ఆలస్యానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే జడ్జిల సంఖ్య పెంచాలని లా కమిషన్ సైతం ప్రతిపాదనలు చేయడంతో బిల్లు రూపొందించి.. ఆమోదింపజేసింది. రాజ్య సభ ఆమోదం అనంతరం రాష్ట్రపతి వద్దకు బిల్లు చేరనుంది. సంతకం చేసిన తరువాత చట్టంగా మారనుంది. అనంతరం, కొలీజియం ద్వారా సుప్రీంకోర్టులో మరికొంత మంది జడ్జిలను నియమించుకునే అవకాశం కలగనుంది. కొత్త చట్టంతో హైకోర్ట్ జడ్జిలుగా కొత్త వారికి అవకాశం దక్కబోతుంది.

