కలం, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. అయితే, శాంతియుతంగా, ఎలాంటి హింసకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలు, మద్దతుదారులకు సీజేపీ నేతలు కీలక సూచనలు జారీ చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ దేశవ్యాప్త నిరసన చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. ఢిల్లీ వీధుల్లో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party), విద్యార్థులు కదం తొక్కుతున్నారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై కేంద్రప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్ తో ఆందోళన చేపట్టాయి.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బుధవారం నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయగా.. భద్రతా సిబ్బందిపై విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలపై సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
Read Also: ఎంపీలతో రాహుల్ సమావేశం.. ఏం చేయబోతున్నారు?
Follow Us On : WhatsApp

