కలం, ఖమ్మం బ్యూరో: గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో ఖమ్మం జిల్లా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడమే కాకుండా.. ఆగస్టు 1 నుంచి ఖమ్మం, వైరా, సత్తుపల్లి పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తీరనున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. బుధవారం దంసలాపురం వద్ద జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం అసలు ప్రణాళికలో లేకపోయినా దంసలాపురం, కల్లూరు, సత్తుపల్లి వద్ద ప్రత్యేక ఎగ్జిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే 90 శాతం వాహనాలు ఈ రహదారి ద్వారానే పయనిస్తాయని, దీనివల్ల ఖమ్మం నగరానికి సహజసిద్ధంగా ఔటర్ రింగ్ రోడ్ తరహా వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఖమ్మం–అశ్వారావుపేట రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి, భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి నీటి బొట్టునూ జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

