కలం, ఖమ్మం బ్యూరో: జిల్లా కేంద్రంలో ముగ్గురు మంత్రులకు సకల సౌకర్యాలతో హెడ్క్వార్టర్స్ ఉన్నాయని, కానీ విద్యార్థులకు చదువుకోవడానికి కనీస బడి భవనాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మండిపడ్డారు. బుధవారం సీపీఎం బృందం (Khammam CPM) ఖమ్మంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజకవీధిలోని బడి శిధిలావస్థకు చేరడంతో అక్కడ చదువుతున్న 60 మంది పిల్లలు 2 కి.మీ దూరంలోని రమణగుట్ట బడికి వెళ్లాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు బడి భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు.
కేవలం నాలుగు గదులున్న రమణగుట్ట స్కూల్లో 160 మంది విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రజకవీధి పాఠశాలకు తక్షణమే నిధులు కేటాయించి ప్రారంభించకపోతే డిఇఓ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రీశ్రీ విగ్రహం నుంచి మున్నీరు వరకు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ హైస్కూల్ ఏర్పాటు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు నున్నా నాగేశ్వరరావు, వై. విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, జబ్బర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

