కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మోదీ కాపాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు హుస్నాబాద్లో పొన్నం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు ముఖ్య నేతల అరెస్టులపై మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేశారని ఖండించారు.
నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీలో జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. ఢిల్లీలో విద్యార్థుల లాఠీచార్జ్ హింసపై విచారణ జరిపించాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా వారికి మద్దతుగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఆందోళన చేపట్టారన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేసిన శాంతియుత నిరసనపై నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తమపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నా ఇంకా కొట్టండి అని గాంధేయవాదుల్లా నిరసన తెలిపారని ప్రశంసించారు.
ఈ నిరసనలో ఎంతో మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయని, విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం కూడా తెలపలేదన్నారు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై మాట్లాడుతూ వారి గళం వినిపిస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ ఇంటి ముందు శాంతియుత నిరసన చేస్తే అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, విద్యార్థులపై దాడి గురించి మోదీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ అని, ఇప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పొన్నం స్పష్టం చేశారు. ఢిల్లీలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై లాఠీ చార్జ్కు పాల్పడ్డ వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడుల్లో గాయపడ్డ యువతకు వైద్యం అందించాలని కోరారు.

