కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భగత్ నగర్ చౌరస్తాలో ఒక ఇంట్లో కత్తులు, తుపాకులతో బెదిరించి భారీ దోపిడీ (Robbery)కి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులను చితకబాది.. 50 తులాల బంగారం, రూ.20 లక్షల నగదుతో పాటు రెండు ద్విచక్రవాహనాలను దొంగిలించి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని భగత్ నగర్ చౌరస్తా ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఇంట్లో ఉన్న లైట్లు ఆఫ్ చేసి, పడుకోవడానికి బయటకు వచ్చిన ఇంటి యజమానిని ముసుగులు ధరించిన దొంగలు వెనకవైపు నుంచి వచ్చి నోరు మూసేశారు. వృద్ధుడిని దొంగలు చితకబాదుతూ ఇంటిలోనికి తీసుకువచ్చారు. లోపలికి చొరబడిన దుండగులు తుపాకులు, కత్తులు చూపిస్తూ కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించారు.
ముందు అందరినీ కట్టేసి దారుణంగా చితకబాదినట్లు తెలుస్తోంది. ఇంట్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వృద్ధ దంపతులను కట్టేసి, వారిపై దాడి చేసి మహిళల ఒంటిపై ఉన్న బంగారంతో పాటు బీరువాలో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఇరుగుపొరుగు వారికి ఎలాంటి అనుమానం రాకుండా, బాధితుల అరుపులు బయటకు వినపడకుండా ఉండేందుకు దొంగలు చాకచక్యంగా ఇంట్లోని టీవీ సౌండ్ను పెంచేశారు.
ఈ ఘటనలో 50 తులాల బంగారం, రూ.20 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బయటకు వెళ్తూ అక్కడ పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలు సైతం దొంగిలించి వాటి మీదే పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా దొంగల కదలికలను గమనిస్తున్నారు. ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్వయంగా విచారణ చేపడుతున్నారు.
ఈ దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సీపీ కేంద్ర మం్తరికి వెల్లడించారు. విచారణను ముమ్మరం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

