కలం, వెబ్ డెస్క్: రామాయపట్నం పోర్టు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంపై రూ.3,500 కోట్ల ఆర్థిక భారం మోపుతూ చేస్తున్న అభివృద్ధి ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇది భారీ కుంభకోణం అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో స్పందిస్తూ.. పోర్టు అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుతో పాటు మూడు పోర్టుల పనులు వేగంగా ముందుకు సాగాయని జగన్ పేర్కొన్నారు. భూసేకరణ, అనుమతులు, ఆర్థిక ముగింపు ప్రక్రియలను పూర్తి చేసిందన్నారు. పోర్టుల అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రామాయపట్నం పోర్టు ద్వారా ప్రధాన పరిశ్రమలకు ప్రోత్సాహం లభించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన గుర్తు చేశారు.

