కలం, కరీంనగర్ బ్యూరో: కేసీఆర్ ఒక్క మాట చెబితే తామే వెళ్లి పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సంయమనం పాటించాలని వారించడంతోనే తాము ఆగిపోయినట్లు వివరించారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పరిశీలించి మాట్లాడారు.
ఉరికించి కొడతారు..
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాల గురించి కేసీఆర్ బయటకొచ్చి చెబితే ప్రజలు ఉరికించి కొడతారని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరంలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్లు, కెనాల్లు, మోటార్లు, సబ్స్టేషన్లు.. అన్నీ బాగున్నాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బుర్ర మాత్రమే బాగాలేదన్నారు. తమ డిమాండ్కు అనుగుణంగా రేవంత్ రెడ్డి పంపులు ఆన్ చేసి, రైతులకు నీరు ఇస్తే.. ఆయన దొంగతనాల గురించి మాట్లాడబోమని హామీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య…
గోదావరి బేసిన్లో ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, అన్నారం ప్రాజెక్టుల్లో 20 శాతం కంటే నీళ్లు ఎక్కడా లేవని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ మీదుగా రోజుకు తొమ్మిది టీఎంసీ నీళ్లు కిందకు పోతుంటే.. లోయర్ మానేరు డ్యాం నోరు వెళ్లబెట్టి చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ జలాశయం మీద ఆధారపడిన కరీంనగర్తో సహా 9 నియోజకవర్గాలకు తాగునీటి సమస్య రాబోతుందని హెచ్చరించారు. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

