కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి (Rudraram Village) చెందిన మెరుగు పద్మ కుటుంబం ఇంటికి వెళ్లే దారిని అడ్డగించి ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ (KVPS) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ (Thipparapu Suresh) జిల్లా అధికారులను కోరారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మెరుగు పద్మ కుటుంబం గ్రామకంఠం భూమిలో సుమారు 20 ఏళ్లుగా నివాసం ఉంటూ అదే దారిని రాకపోకలకు ఉపయోగిస్తోంది. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దారిలోని చెట్లను నరికి అడ్డంగా వేసి, కుటుంబ సభ్యుల రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మెరుగు పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. నాగం సుదర్శన్, నాగం సుధాకర్తో పాటు మరికొందరు ఈ చర్యలకు పాల్పడ్డారని, దీంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతపై కూడా ఆందోళన నెలకొందని తెలిపారు. ఇంటి దారికి అడ్డంగా వేసిన చెట్లను వెంటనే తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిప్పారపు సురేష్ డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?
Follow Us On: X(Twitter)

