కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామ సమీపంలో గురువారం ఘోర కారు ప్రమాదం (Car Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు కారులో దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దిమ్మదుర్తి సమీపంలో రహదారిపై ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో గంగడి దశరథ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

